దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి.. మెదక్ ఎంపీగా పోటీ చేసేది ఈయనే!

by Disha Web Desk 2 |
దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి.. మెదక్ ఎంపీగా పోటీ చేసేది ఈయనే!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి అధికార పార్టీ తరపున పోటీలో నిలిచేదేవరనే అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో స్వయంగా సీఎం కేసీఆరే ప్రభాకర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెదక్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారనేది ఆసక్తి నెలకొన్నది. ఎమ్మెల్యే రఘునందన్ రావును దుబ్బాకలో ఓడించడమే లక్ష్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పెద్ద నియోజకవర్గం, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా బలమైన లీడర్లు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి కూడా బలమైన నేతనే బరిలో దింపాల్సి ఉంటుంది. కాగా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు.

ప్రతాప్ రెడ్డా..? మరొకరా..?

జరగబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తారా..? మరో చోటకు వెళతారా..? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉన్నది. మెదక్ ఎంపీ అభ్యర్థి వ్యవహారం గజ్వేల్‌తో ముడిపడి ఉన్నదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డిని గజ్వేల్ నుంచి గెలిపించాలని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఓ సమీక్షలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో గతంలో సీఎం అన్న విషయం తెలిసిందే. అయితే సీఎం ఇంకా అదే మాటమీద ఉన్నారా..? మనసుమార్చుకున్నారా..? తెలాల్సి ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగానే ఉన్నదని, పార్టీ వీక్‌గా ఉన్న జిల్లాలో ఏదో ఓ చోట నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం గజ్వేల్‌ను వీడితే ఇక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు. సీఎం ఇక్కడే ఉంటే మాత్రం ప్రతాప్ రెడ్డిని మెదక్ ఎంపీ బరిలో దింపనున్నట్లు కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రతాప్ రెడ్డి గజ్వేల్ అసెంబ్లీ బరిలో ఉండి, సీఎం మరో సెగ్మెంట్‌కు వెళితే మాత్రం మరొకరిని మెదక్ ఎంపీ బరిలో దింపనున్నారు. అలా నిలిచేదెవరో వేచి చూడాల్సి ఉన్నది.

దుబ్బాకలో రసవత్తర పోటీ..

మెదక్ ఎంపీ దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనున్నది. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సుజాత పోటీ చేసి బీజేపీ నేత రఘునందన్ రావుపై ఓటమి చెందిన విషయం తెలిసిందే. సెంటిమెంట్ కూడా ఇక్కడ పనిచేయలేదనే చెప్పుకోవచ్చు. ఈ సారి రఘునందన్ రావును ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ బరిలో దింపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గెలుపే లక్ష్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడే మకాం వేసి అభివృద్ధికి నిధులు కేటాయించుకోవడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

Read More: దుబ్బాకలో ‘కొత్త’ జోష్.. ప్రతిపక్షాల అలర్ట్

Next Story

Most Viewed